-
చిరంజీవి సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చిన నాని
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించబోయే ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ‘దసరా’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందనుండగా, ప్రముఖ నటుడు నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇటీవల నాని తన నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ, మీడియాతో కీలక విషయాలు పంచుకున్నారు. మే 1న ‘హిట్ 3’ విడుదల కానుండగా, ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ గురించి ఆయన స్పందించారు.
నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రస్తుతం నేను ‘ప్యారడైజ్’ అనే ప్రాజెక్ట్పై పని చేస్తున్నాను. దాని షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే చిరంజీవిగారి సినిమాను ప్రారంభిస్తాము” అని తెలిపారు.
ఇక ఈ మెగా ప్రాజెక్ట్ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాని స్పష్టం చేశారు. ‘దసరా’తో తనదైన శైలిని ప్రదర్శించిన శ్రీకాంత్ ఓదెల, చిరంజీవిని ఎలా మరోవిధంగా చూపించబోతున్నారన్న ఉత్కంఠ ఇప్పటికే ప్రేక్షకుల్లో నెలకొంది.
సినిమా టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం తదితర వివరాలను ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైన తర్వాత వెల్లడిస్తామని నాని వెల్లడించారు.